KTR : మద్యం పాలనగా మారిన తెలంగాణ? కేటీఆర్ ప్రశ్నలు

Telangana Becoming a Liquor-Driven State? KTR Questions Government

KTR : మద్యం పాలనగా మారిన తెలంగాణ? కేటీఆర్ ప్రశ్నలు:హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం దుకాణాలను గ్రామాలకు విస్తరించాలనే నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ పాలనలో “ఇంటింటికీ మద్యం” – కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం దుకాణాలను గ్రామాలకు విస్తరించాలనే నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ విమర్శలు చేసిందని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆదాయం కోసం మద్యం అమ్మకాలనే నమ్ముకుందని ఆయన దుయ్యబట్టారు.

గతంలో ప్రగతి పథంలో పయనించిన తెలంగాణను “తాగుబోతుల తెలంగాణ”గా మారుస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.

కేటీఆర్ ఆరోపణలు:

కేటీఆర్ తన ట్వీట్‌లో గత బీఆర్ఎస్ పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ పాలనను పోల్చి చూస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు:

  • గతంలో కేసీఆర్ పాలనలో: “పల్లె పల్లెకు ప్రగతి రథచక్రాలు. ప్రతి చేనుకు నీళ్లు.. ప్రతి చేతికి పని. ఇంటింటికి తాగునీళ్లు.. ఆడబిడ్డలకు తప్పిన ఇబ్బందులు. నాడు ప్రగతి బాట పట్టిన తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని నిందలు.”
  • ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో: “నేడు పల్లె పల్లెలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ప్రియుల బలహీనతను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరుగా మార్చుకునే కుట్ర.”

కేవలం మద్యం అమ్మకాలపైనే ఆధారపడటాన్ని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. “అన్ని రంగాలలో తెలంగాణ ప్రగతిని దెబ్బతీసి.. ఇప్పుడు తీరిగ్గా ఆదాయం కోసం మద్యం అమ్మకాలను నమ్ముకున్న అసమర్థ కాంగ్రెస్ సర్కార్” అని ఆయన ధ్వజమెత్తారు.

ఆదాయం, విధానాలపై విమర్శలు:

కేటీఆర్ తన పోస్ట్‌లో మద్యం వినియోగం, విధానాలపై గణాంకాలను కూడా ఉదహరించారు:

  • మద్యం ఖర్చు పెరుగుదల: “ఏడాది క్రితం సగటున ఒక వ్యక్తి మద్యం కోసం చేసే ఖర్చు రూ.897. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సగటున ఒక వ్యక్తి మద్యం మీద చేస్తున్న ఖర్చు రూ.1623కు పెరిగింది.”
  • లైసెన్స్ విధానం మార్పులు: “లైసెన్స్ గడువు మూడేళ్లకు పెంచి, ధరఖాస్తు ధర రూ.3 లక్షలకు పెంచాలని నిర్ణయం.”

గతంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆదాయం కోసం దానినే నమ్ముకుందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. “ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం. పాలన గాలికి.. ప్రగతి కాటికి” అంటూ ఆయన తన ట్వీట్‌ను ముగించారు.

Read also:SrisailamDam : శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం

 

Related posts

Leave a Comment